ఏపీజే అబ్దుల్ కలాం.. ఏ లక్ష్యమూ తెలియని కొన్ని లక్షల మందికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ప్రసంగాలిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. సోమవారం ఆయన కోట్లాది హృదయాలను కలవరపెడుతూ తనువు చాలించిన విషయం తెలిసిందే. అబ్దుల్ కలాం అంటే ఓ గొప్ప వ్యక్తి, అద్భుతమైన సైంటిస్ట్, భారతావనికి రాకెట్ను పరిచయం చేసిన ఘనుడు, రాష్ట్రపతిగా కూడా పనిచేసిన వ్యక్తి. అయితే ఆయన్ను అందరూ ఎక్కువగా గౌరవించేది, గుర్తించేదీ ఒక స్ఫూర్తి ప్రధాతగానే! ఆ స్ఫూర్తిని నింపడమనే లక్షణమే ఆయనకు, ఆయన అలంకరించిన పదవులకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
ఇక ఆయన మృతి పట్ల యావత్ దేశం దిగ్బ్రాంతికి లోనైంది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు సైతం కలాం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఘనతను కొనియాడింది. నేడు కలాం అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగాయి. తమిళ నాట ఆయన మృతి చెందాడన్న వార్త అందరినీ కలచివేసింది. ఇక ఆయనకు సంతాపం ప్రకటిస్తూ రేపు తమిళనాడులోని అన్ని థియేటర్లలో ఉదయం, మధ్యాహ్నం షోలను నిలిపివేస్తున్నారు. తమ తరపున నివాళిగా థియేటర్ల యాజమాన్యం ఈ రెండు షోల బంద్ను నిర్వహించనున్నాయి. ఇక భారత ప్రభుత్వ ఏడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.


