
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పోలీస్ థ్రిల్లర్ ‘ధృవ’ మరో నెలరోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ సినిమా కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల ఉత్సాహం రెట్టింపవుతూ వస్తోంది. ఇక అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలన్న ఉద్దేశంతో టీమ్ శరవేగంగా ప్రొడక్షన్ పూర్తి చేస్తోంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, మిగిలి ఉన్న ఇంట్రో సాంగ్ను కూడా ఈ వారంలో పూర్తి చేయనున్నారు.
ఇక అదేవిధంగా ఇప్పట్నుంచే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేయాలన్న ఆలోచనతో నవంబర్ 9న ఆడియోను విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో పెద్ద సినిమాలన్నింటికీ చేసినట్లుగా ఆడియో లాంచ్ వేడుక ధృవకి ఉండడం లేదు. నేరుగా మార్కెట్లోకే ఆడియోను విడుదల చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ గత రెండు చిత్రాలైన సరైనోడు, శ్రీరస్తు శుభమస్తుకి కూడా ఇలాగే నేరుగా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేయడం, ఆ తర్వాత రిలీజ్కు ముందు పెద్ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం జరిగింది.
‘ధృవ’కి కూడా విడుదలకు ముందు ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తుండగా, నాటితరం స్టార్ హీరో అరవింద్ స్వామి విలన్గా నటిస్తున్నారు.