గత 20 సంవత్సరాల పై నుంచి వెండితెరపై కనిపించి తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని నాగర్జున ప్రస్తుతం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే రియాలిటీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వారందరితో ఎంతో క్లోజ్ గా ఉంటూ వారి కష్టనష్టాలను కూడా తెలుసుకుంటున్నారు.
ఈ షోలో సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవడం మీకెలా అనిపిస్తోంది అన్న ప్రశ్నని నాగార్జున ముందుంచితే ‘నేను సామాన్య ప్రజల సమస్యలు వినడమే కాకుండా వారి సమస్యలను నా సమస్యలతో పోల్చుకుంటున్నాను. ఒక సినిమా ఫ్లాప్ అయితే చాలా బాధపదిపోతాం. కొంతమంది కొన్ని నెలలైనా బయటకి రారు. కానీ రేపు అనేది ఎలా గడుస్తుందో తెలియక రాత్రంతా నిద్ర లేకుండా గడిపే వారి సమస్యల ముందు సినిమా ఫ్లాప్ అనేది చాలా చిన్న సమస్య అని’ నాగార్జున సమాధానం ఇచ్చాడు.
అంతటితో ఆగకుండా ఈ విషయాలను తన కుటుంబ సభ్యులతో కూడా చర్చిస్తున్నాని కూడా తెలిపాడు. తాజాగా ‘మనం’ సినిమాతో సక్సెస్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం అతని దృష్టి మొత్తం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పైనే ఉంది. తన తదుపరి సినిమా వివరాలను ఈ షో మొదటి సీజన్ అయిపోయాక అనౌన్స్ చేసే అవకాశం ఉంది.


