సుందర్ పవన్ దర్శకత్వంలో ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాల పై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. ఈ సినిమాలో ‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, సదా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కతోంది. బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు.
అనంతరం దర్శకుడు సుందర్ పవన్ మాట్లాడుతూ ‘‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. ముఖ్యంగా ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. అతి త్వరలో సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం అన్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ ‘‘సినిమాలో నటించడానికి అంగీకరించిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరునా కృతజ్ఞతలు. పవన్ చాలా కోపరేటివ్ డైరెక్టర్. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.
భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని ! (నవ్వుతూ…) మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి. ఎలా చేస్తాడో ! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్ని అభినందిస్తున్నా. సినిమాలో మొదటి పాటను దర్శకుడు పవన్ నాకు వినిపించారు. చాలా బావుంది. విడుదలైన తర్వాత కొన్నేళ్ళ పాటు పార్టీల్లో ఆ పాట వినిపిస్తుంది’’ అన్నారు.
మధుబాల మాట్లాడుతూ ‘‘హీరో పై మాత్రమే ఎక్కువ ఫోకప్ చేసే ఇండస్ట్రీలో… హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేనే సంతకం చేశా. ఇటువంటి సినిమా తీస్తున్నందుకు, అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు పవన్, నిర్మాత గుప్తాగారికి థ్యాంక్స్’ అన్నారు.
సదా మాట్లాడుతూ ‘‘వేదికపై ఎక్కువమంది మహిళలున్నారు. నిజంగా వీళ్ళందరితో ఇక్కడ ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అన్నారు. దీప్తీ భట్నాగర్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ రావడం, అదీ 20 ఏళ్ళ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీ నా ఫస్ట్ లవ్. నాకింకా ‘పెళ్లి సందడి’ సినిమా షూటింగ్ చేసిన రోజులు గుర్తున్నాయి అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ సదాశివుని, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: సాయిశ్రీరామ్, నిర్మాత: భోగేంద్ర గుప్తా, కథ–మాటలు–స్ర్కీన్ప్లే–దర్శకత్వం: సుందర్ పవన్.


