శ్రీ చక్రస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చింత వంశీ రెడ్డి, చింత గోపాల కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట్ జంటగా నటించిన ఈ సినిమా టీజర్కు ఇప్పటికే మంచి స్పందన లభించింది.
ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘వెళ్లే దారిలో’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆలపించడం విశేషం. చందు-రవి స్వరపరిచిన ఈ గీతం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో చిత్రబృందం రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ.. చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకునే యువతకు ఈ సినిమా ఒక స్ఫూర్తి అని, తమ బలహీనతనే బలంగా మార్చుకోవాలనే సందేశం ఇందులో ఉందని కొనియాడారు. రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాత గోపాల కృష్ణారెడ్డి తెలపగా, ఇది మలయాళ సినిమా తరహాలో ఉండే ఫీల్ గుడ్ ఎమోషనల్ స్టోరీ అని హీరోహీరోయిన్లు పేర్కొన్నారు. క్లైమాక్స్ చూసి కన్నీళ్లు వచ్చాయని దర్శకుడు వినయ్ రత్నం భావోద్వేగానికి లోనయ్యారు.


