విజయ్ కృష్ణ హీరోగా యుఎ క్రియేషన్స్ పతాకంపై మల్లిఖార్జున్ ఉప్పలపాటి నిర్మిస్తున్న సినిమా ‘అలర్ట్’. సంజనా చౌదరి హీరోయిన్. మూర్తి కొడిగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి. సముద్ర ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు హాజరై యూనిట్ సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో
అతిథిగా హాజరైన బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ “మా స్నేహితుడు మల్లిఖార్జున్ మొట్టమొదటి సారి నిర్మిస్తున్న సినిమా. అన్ని థియేటర్లో విడుదలై ఘన విజయం సాధించాలి. పర్ఫెక్ట్ ప్లాన్ తో బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని సినిమా చేస్తున్నారు” అన్నారు.
హీరో విజయ్ కృష్ణ మాట్లాడుతూ “హీరోగా నా నాలుగో సినిమా ఇది. ఆన్ లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయ, యువత ఎలా మోసపోతున్నారు అనే అంశాల మీద స్క్రిప్ట్ రెడీ చేశారు. కథ నచ్చింది. మా దర్శకుడు రాజమౌళి టైప్. అమరశిల్పి జక్కనలా చెక్కుతాడు. మేం కష్టపడి సినిమా చేస్తాం. ఆడియన్స్ హిట్ చేస్తారని ఆశిస్తున్నా” అన్నారు.
ప్రొడ్యూసర్ మల్లిఖార్జున్ ఉప్పలపాటి మాట్లాడుతూ “మా సినిమా ఓపెనింగ్ కి వచ్చిన అతిథులకు పేరు పేరునా ధన్యవాదాలు. ముందుగా చిన్న లైన్ అనుకున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయినటువంటి ఓ వ్యక్తికి ఎదురైన ఘటనతో సినిమా చేస్తున్నాం. అతని జీవితంలో జరిగినది విన్నప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం. డైలాగ్ వెర్షన్ బాగా రావడంతో వెబ్ సిరీస్ అనుకున్నాం. ఇంకా బలంగా రావడం ఓటీటీకి సినిమా చేద్దాం. పెద్దలను సంప్రదించి సినిమా చేస్తున్నాం. తెరపై మా కష్టం మీకు అర్థం అవుతుంది. సినిమాపై మా హీరోకి ఎంతో పిచ్చి. కాకినాడ కింగ్. అతనితో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.
దర్శకుడు మూర్తి కొడిగంటి మాట్లాడుతూ “ఏడాదిన్నర నుండి నిర్మాత మల్లిఖార్జున్ ఉప్పలపాటితో పరిచయం. ముందు ఈ కథతో షార్ట్ ఫిల్మ్ చేశాం. అది నచ్చడంతో సినిమా చేస్తున్నాం. సినిమాకు హీరోతో పాటు మెయిన్ పిల్లర్ లాంటి మరో ముఖ్యమైన పాత్రలో నిర్మాత నటిస్తున్నారు. ఆయన అయితేనే న్యాయం చేయగలరని ఒప్పించా. ఎన్నో హిట్ సాంగ్స్ చేసిన, ఇండస్ట్రీలో పదేళ్ల నుండి నాకు పరిచయం ఉన్న ఎం.ఎల్. రాజా సంగీతం అందిస్తున్నారు. పదిహేను రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం కాకినాడలో చేస్తాం” అన్నారు.


