వరుస విజయాలతో టాలీవుడ్లో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఈ భారీ బ్లాక్బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కల్యాణ్ రామ్లతో కలిసి పట్టాలెక్కించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనే విషయంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న అనిల్ రావిపూడి, ఈ పుకార్లకు చెక్ పెట్టాడు. కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నట్లు ఆయన అధికారికంగా ధృవీకరించారు.
ఇక ఈ మల్టీస్టారర్ మూవీలో విక్టరీ వెంకటేష్ జోడీగా ఏ హీరోయిన్ మెరవబోతుందనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. అనిల్ రావిపూడి-వెంకటేష్ కాంబినేషన్ అంటేనే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ కావడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
