మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే విషయాలను తాను పట్టించుకోనని, అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనని అన్నారు. గతంలో ‘మా’ ఫండ్ రైజింగ్ కార్యక్రమాల పేరుతో ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని అమెరికాకు వెళ్లారని, ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు ‘మా’కు శాశ్వత భవనాన్ని ఎందుకు కట్టలేకపోయారని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ‘మా’ బిల్డింగ్ కోసం కనీసం ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారని అన్నారు. ‘మా’ బిల్డింగ్ నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చారని, తాను కూడా అందులో భాగస్వామినవుతానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. నటీనటులందరూ కలిసి వస్తే ఇంద్ర భవనాన్నే నిర్మించవచ్చని సూచించారు.