‘ఆనలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటుడు నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘బేవర్స్’. ఈచిత్రాన్ని రమేష్ చెప్పాల దర్శకత్వం లో సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా కాసం సమర్పణలో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
ఈసందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మొదట్లో ఈ చిత్రానికి బేవర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్ కి కూడా వస్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఈ చిత్రం చూస్తే అర్దమవుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది.
డైరెక్టర్ రమేష్ చెప్పాలా మాట్లాడుతూ మీ శ్రేయోభిలాషి చిత్రానికి రచయిత గా ఎంత గా తృప్తి చెందానో బేవర్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందాను. రాజేంద్రప్రసాద్ గారు ఈ పాత్ర ఇప్పటివరకు చేయకపోవడం నా అదృష్టం. ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుంది. అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని అన్నారు.