అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘కింగ్డమ్’, ‘కాంత’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, నటిగా ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. వరుస ఫ్లాపుల తర్వాత, తాజాగా విడుదలైన ‘లెనిన్’ చిత్రం ఈ బ్యూటీకి కెరీర్లో భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. ఇందులో భాగ్యశ్రీ నటనకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి.
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటున్న ఈ క్రేజీ హీరోయిన్, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పటికే మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే, ‘లెనిన్’ సినిమా సక్సెస్తో భాగ్యశ్రీ బోర్సే తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేసింది. గతంలో ఒక్కో సినిమాకు రూ. 1.5 కోట్లు వసూలు చేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఏకంగా రూ. 2.5 కోట్లు డిమాండ్ చేస్తోందట. కొత్తగా వచ్చే ఆఫర్లన్నింటికీ ఇదే రేంజ్ ఫీజును కోట్ చేస్తోందని టాలీవుడ్ సమాచారం.
ప్రస్తుతానికి భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ ప్రయారిటీ తెలుగు సినిమాలకే అయినప్పటికీ, ఇతర భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన ‘సేయోన్’ అనే చిత్రంలో నటిస్తూ తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ యంగ్ బ్యూటీ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి


