ఇప్పటివరకు భీమవరం టాకీస్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏకంగా 114 చిత్రాలను ప్రొడ్యూస్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఆయన ఇప్పుడు ప్రపంచ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి ఏకంగా 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లోని సారధి స్టూడియోలో అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యారు. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్ శ్రీనివాస్, చీకటి ప్రవీణ్, ఇమ్మడి రమేష్, వంశీ రామరాజు, కె.ధర్మారావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ తదితర దిగ్గజాలు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇక ఈ 15 చిత్రాలను 15 మంది దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి..
1) జస్టిస్ ధర్మ – (యండమూరి వీరేంద్రనాధ్)
2) నాగపంచమి – (ఓం సాయిప్రకాష్)
3) నా పేరు పవన్ కల్యాణ్ – (జె.కె.భారవి)
4) టాపర్ – (ఉదయ్ భాస్కర్)
5) కె.పి.హెచ్.బి. కాలని – (తల్లాడ సాయికృష్ణ)
6) పోలీస్ సింహం – (సంగకుమార్)
7) అవంతిక- 2 – (శ్రీరాజ్ బళ్ళా)
8) యండమూరి కథలు – (రవి బసర)
9) బి.సి. -(బ్లాక్ కమాండో) – (మోహన్ కాంత్)
10) హనీ కిడ్స్ – (హర్ష)
11) సావాసం – (ఏకరి సత్యనారాయణ)
12) డార్క్ స్టోరీస్ – (కృష్ణ కార్తీక్)
13) మనల్ని ఎవడ్రా ఆపేది – (బి.శ్రీనివాసరావు)
14) ది ఫైనల్ కాల్ – (ప్రణయ్ రాజ్ వంగరి)
15) అవతారం – (డా: సతీష్)
ఈ 15 చిత్రాలకు 15 కెమెరాలతో క్లాప్, స్విచ్ఛాన్, గౌరవ దర్శకత్వం చేయించడం విశేషం. తెలుగు సినిమాకు ప్రపంచ రికార్డు సాధించేలా ఒకేసారి 15 చిత్రాలు మొదలు పెట్టిన రామసత్యనారాయణను అతిధులంతా అభినందించారు. 2025, ఆగస్టు 15న కొబ్బరికాయలు కొట్టిన ఈ 15 చిత్రాలకు 2026 ఆగస్టు 15కి పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని రామసత్యనారాయణ పేర్కొన్నారు. ఈ 15 చిత్రాలకు KLస్టూడియోను 25% డిస్కౌంట్ తో ఇస్తున్నందుకు కొంతంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయి. ఒకేరోజు మొదలై ప్రపంచ రికార్డ్స్ లో నమోదైన ఈ 15 చిత్రాలకు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పి.ఆర్.ఓ. కావడం విశేషం.


