బిహార్ విద్యాశాఖ ఇటీవల సెకండరీ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ రిజల్ట్స్ ను విడుదల చేసింది. ఈ రిజల్ట్స్ లో రిషికేశ్ కుమార్ అనే వ్యక్తి 77 శాతం మార్కులను తెచ్చుకుని ఉత్తీర్ణతను సాధించాడు. అయితే పొరపాటున అతని ఫోటోకు బదులుగా ఒక హీరోయిన్ ఫోటో పడింది. ఉత్తీర్ణతను సాధించిన వ్యక్తి ఫోటో ప్లేస్ లో హీరోయిన్ ‘అనుపమ పరమేశ్వరన్’ ఫోటో కనిపించడంతో బాధితుడు షాక్ అయ్యాడు.
తన ప్లేస్ లో ఆమె ఉండటాన్ని చూసి షాకైన రిషికేశ్ కుమార్ దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ‘నా అడ్మిట్ కార్డు పై కూడా అనుపమ ఫోటోనే వచ్చింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను కూడా. వారు నా ఫిర్యాదు విని, దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అదే అడ్మిట్ కార్డుతో నేను పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇప్పుడు రిజల్ట్స్ లో కూడా మళ్లీ అనుపమ ఫోటోనే రావడం బాధాకరం’ అని చెప్పుకొచ్చాడు.