బెలూన్ రంగును బట్టి కాదు, లోపలున్న గ్యాస్ ను బట్టి ఎగురుతుంది అనే సిద్దాంతాన్ని కెమెరామెన్ రామతులసి బాగా వంటబట్టించుకున్నారు. వాడేది ఏ కెమెరా అయినా క్రియేటివిటీ వుంటే అద్భుతాలు స్రుష్టించచ్చు అని నిరూపించారు. ఆయన సినిమాటోగ్రఫీ అందించిన ‘రక్తం’ చిత్రానికి అంతర్జాతీయ అవార్డు లభించింది. ఒక తెలుగు సినిమాకు అంతర్జాతీయ సినిమాటోగ్రఫీ అవార్డు రావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఆయన `మౌనమే ఇష్టం` అనే చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా పాత్రికేయులతో జెడి.రామతులసి మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…
ముందుగా మీ నేపథ్యం గురించి చెప్పండి.. ?
నేను తెలుగువాడినే, కానీ తమిళనాడులోనే పుట్టి పెరిగాను. ఎన్.కె.ఏకాంబరంగారి వద్ద అసిస్టెంట్ గా పనిచేశాను. షాజీ కైలాస్ నన్ను కెమెరామెన్గా పరిచయం చేశారు.
తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యత….
`మౌనమే ఇష్టం` ఈ నెల 15న విడుదల కానుంది. అలెక్సా కెమెరాను ఉపయోగించి దర్శకుడి అభిరుచికి అనుగుణంగా ప్రతి ప్రేమును పెయింటింగ్ లాగా తెరకెక్కించాం. నేను చెన్నైలో వున్నా తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను.
ఆయనతో మంచి అనుబంధం…
రాజేష్ టచ్ రివర్ గారు మంచి టెక్నీషియన్. నా బంగారు తల్లి సమయంలో ఆయనతో ఏర్పడ్డ పరిచయం ఇంకా కొనసాగుతూనే ఉంది.
మరో అడుగు ముందుకు…
సినిమాటోగ్రాఫర్గా నాకు `మౌనమే ఇష్టం` 7వ సినిమా. `నా బంగారు తల్లి` చిత్రం ద్వారా నేను తెలుగు తెరకు పరిచయం అయ్యాను. రాజేష్ టచ్రివర్ రూపొందించిన ఆ చిత్రం ద్వారా నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే రక్తం చిత్రానికి సినిమాటో గ్రాఫర్ గా పనిచేశాను. `రక్తం` చిత్రానికి గానూ,ఇండియా “గ్యాదరింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ ఒహాయో”లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా అంతర్జాతీయ అవార్డు దక్కింది.
తదుపరి ప్రాజెక్ట్స్…
ప్రస్తుతం తెలుగు, ఒడియా భాషల్లో `పట్నఘడ్` అనే చిత్రం జరుగుతోంది.