టాలీవుడ్ లో తనదైన మ్యూజిక్ తో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవి, ‘పుష్ప 2’ చిత్రానికి ముందు వరకు దాదాపు రూ. 6 కోట్ల పారితోషికం తీసుకునేవారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆయన తన ఫీజును ఏకంగా రెట్టింపు చేసి, కొత్త సినిమాల కోసం రూ. 12 కోట్లు ప్లస్ జీఎస్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పెంపుతో టాలీవుడ్ నిర్మాతలు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు.
మరోవైపు, సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న అనిరుధ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. అయితే అనిరుధ్ సినిమాల మ్యూజిక్ రైట్స్ ద్వారానే ఆ మొత్తం రికవరీ అవుతుండటంతో నిర్మాతలు ఆయనకు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. కానీ డీఎస్పీ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన అడుగుతున్న భారీ పారితోషికం నిర్మాతలకు భారంగా మారుతుండటంతో, టాలీవుడ్ దర్శకులు మరియు నిర్మాతలు ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయ సంగీత దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో నటుడిగా మారుతుండగా, సంగీత దర్శకుడిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నేపథ్య సంగీతం పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్ట్ కూడా ఆయన చేతిలో ఉంది. అయితే పారితోషికం పెంచిన కారణంగా కొత్త ప్రాజెక్టులేవీ ప్రస్తుతం ఆయన ఖాతాలో చేరకపోవడం గమనార్హం.


