సినిమాలను సామాజిక కోణంలో తెరకెక్కించి విజయాలను అందుకోవాలంటే ఖచ్చితంగా ఆ దర్శకుడికి సమాజం మీద… మనుషుల అవసరాలు మనస్తత్వాల మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అప్పుడే ఆ సినిమాలో సహజత్వం ఉంటుంది. అయితే అలాంటి సామాజిక సినిమాల దర్శకుడు అనురాగ్ కశ్యప్. వ్యక్తిగతంగానూ అనురాగ్ కశ్యప్ సామజిక అంశాల పై తనదైన శైలిలో స్పందిస్తూ.. భిన్నమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. అలాగే అనురాగ్ కశ్యప్ రాజకీయ అంశాల పై కూడా తన శైలి వ్యాఖ్యలు చేసి.. చాలాసార్లు వివాదాస్పదంగా కూడా మారారు.
అయితే తాజాగా అనురాగ్ కశ్యప్ ట్విటర్ కు గుడ్ బై చెప్పేశారు. వివరాల్లోకి వెళ్తే… ఎప్పటిలాగే అనురాగ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడి ఆయా పార్టీల అభినానుల చేత సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యారు. తనను ట్రోలింగ్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. అందుకే అనురాగ్ ఈ అంశం పై ట్విటర్ లో పోస్ట్ చేస్తూ… ‘దొంగలు రాజ్యమేలుతారు, దుర్మార్గం జీవన విదానం అవుతుంది. సరికొత్త భారతదేశంలో నివసిస్తున్న అందరికీ శుభాకాంక్షలు. మీరు అభివృద్ధిలోకి వస్తారు. నేను నా అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచలేనపుడు నేను మౌనంగానే ఉండిపోతాను, గుడ్ బై’ అని అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశాడు.