హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ నయా చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ జరుగుతుండగా ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. షూటింగ్ ముగిసిన అనంతరం, దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో స్థానిక టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మను ఒక విషపూరిత కీటకం కుట్టింది. మొదట దీన్ని ఆయన పెద్దగా పట్టించుకోనప్పటికీ, ఆరు గంటల తర్వాత కాలులో తీవ్రమైన నొప్పి మొదలైంది.
ఆ అనారోగ్యంతోనే ఆయన కోల్కతాకు విమానం ఎక్కారు. అయితే ప్రయాణం మధ్యలో ఆయనకు విపరీతమైన జ్వరం రావడంతో పాటు పరిస్థితి విషమించింది. కోల్కతా చేరుకోగానే ఆయనను వెంటనే అక్కడి స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రాజేష్ శర్మ ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఇంకా ప్రమాదం నుండి బయటపడలేదని, పూర్తి పరీక్షల అనంతరం వైద్యులు తాజా హెల్త్ అప్డేట్ను విడుదల చేస్తారని సమాచారం.


