తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ అవార్డు’ అందుకున్న “వనజీవి రామయ్య” లఘు చిత్ర నిర్మాత బూసం రవీంద్రనాథ్, తన రెండో సినిమా నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ 40 నిమిషాల షార్ట్ ఫిల్మ్, ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా నిలిచి 5 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని గెలుచుకుంది.
నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో బి.ఆర్. మూవీస్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించారు. నిర్మాతగా తన తొలి ప్రయత్నమే విజయవంతం కావడం, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కడం తనకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని రవీంద్రనాథ్ తెలిపారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రవీంద్రనాథ్.. ప్రస్తుతం తన రెండో సినిమాకు సంబంధించిన కథా చర్చలు ముమ్మరంగా జరుపుతున్నారు. భవిష్యత్తులో చిరంజీవితో ‘ఠాగూర్’ లాంటి సినిమా చేయాలన్నదే తన ఆశయమని ఆయన వెల్లడించారు. ఈ లఘు చిత్ర విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.



