India vs WI T20 World Cup 2026 : విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ శాంసన్..సెమీస్‌లో టీమిండియా

India vs WI T20 World Cup 2026 : విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ శాంసన్..సెమీస్‌లో టీమిండియా

Published on Mar 1, 2026 11:13 PM IST

India vs WI T20 World Cup 2026

  • కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సూపర్-8 డూ-ఆర్-డై మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా (India vs WI T20 World Cup 2026) ఘన విజయం సాధించి సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లింది.
  • 196 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించడంలో సంజూ శాంసన్ (97 నాటౌట్) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగా, తెలుగోడు తిలక్ వర్మ (27) కీలక భాగస్వామ్యం అందించాడు.
  • ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ (82 రన్స్) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును సంజూ శాంసన్ చెరిపేశాడు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 (India vs WI T20 World Cup 2026) ‘సూపర్ 8’ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పోరులో వెస్టిండీస్‌ నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను మరో 4 బంతులు మిగిలి ఉండగానే, 5 వికెట్లు కోల్పోయి సక్సెస్ ఫుల్ గా ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు భారత్ అధికారికంగా సెమీ-ఫైనల్స్‌కు క్వాలిఫై అయింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ (40), షాయ్ హోప్ (32) మంచి పునాది వేయగా.. కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (34 నాటౌట్), జాసన్ హోల్డర్ (37 నాటౌట్) ఆఖర్లో రెచ్చిపోయారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసి విండీస్ స్కోరు బోర్డుకు కళ్లెం వేసాడు.

భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు పవర్ ప్లే లోనే దెబ్బ తగిలినా.. సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా మన తెలుగు కుర్రాడు, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 15 బంతుల్లోనే 27 పరుగులు చేసి తెలుగు రాష్ట్రాల అభిమానులను ఉర్రూతలూగించాడు. వీరిద్దరి భాగస్వామ్యం విండీస్ బౌలర్ల లయను దెబ్బతీసింది. చివర్లో హార్దిక్ పాండ్యా (17) ఔటైనా.. శివమ్ దూబే సపోర్ట్ తో, రోమారియో షెఫర్డ్ వేసిన ఆఖరి ఓవర్లో శాంసన్ భారీ సిక్సర్, ఆ వెంటనే ఓ కళ్లు చెదిరే ఫోర్ కొట్టి స్టైల్‌గా మ్యాచ్‌ను ముగించాడు.

రికార్డుల మోత: ఈ ఛేజింగ్ టీమిండియాకు చాలా ప్రత్యేకం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో లక్ష్య ఛేదనలో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు (97) ఇదే. గతంలో విరాట్ కోహ్లీ (ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌పై 82 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు.

గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్, సూపర్ 8లో సౌతాఫ్రికా చేతిలో ఓడటంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కానీ కఠినమైన ప్రెషర్ సిట్యువేషన్‌లో జింబాబ్వే, విండీస్ పై వరుసగా భారీ స్కోర్లను నమోదు చేసి డిఫెండింగ్ ఛాంపియన్ ట్యాగ్‌ను భారత్ నిలబెట్టుకుంది. ముఖ్యంగా స్పిన్‌ను అద్భుతంగా ఆడే తిలక్ వర్మ ఫామ్‌లోకి రావడం, రాబోయే నాకౌట్ మ్యాచ్‌లకు ముందు భారత మిడిలార్డర్ కు కొండంత బలాన్నిచ్చింది.

వాంఖడేలో ఇంగ్లండ్‌తో అమీతుమీ

విండీస్‌పై అద్భుత విజయంతో సెమీ-ఫైనల్‌ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు మహా సంగ్రామానికి సిద్ధమైంది. మార్చి 5 (గురువారం) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీ-ఫైనల్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే అవకాశం ఉండటంతో, మరోసారి పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా భారత జట్టుకు ఈ మైదానంతో ఉన్న సెంటిమెంట్ (2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ సెమీస్ విజయాలు) అభిమానుల్లో కొండంత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇదే జోరు కొనసాగించి, ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు