ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కు మధ్య జరిగిన ‘ఇండియన్ 2’ వివాదంలో డైరెక్టర్ శంకర్ కు పెద్ద ఊరట లభించింది. లైకా వేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడంతో పాటు శంకర్ తనకు నచ్చిన సినిమాలను తీసుకునే అవకాశాన్ని కలిగించింది. పైగా నిర్మాణ సంస్థ కోరిన రూ.170.23 కోట్ల అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించడం విశేషం.
ఇక ఈ వివాదం పై శంకర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘2019లో చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ షరతులు పాటించలేదు. అందుకే అనుకున్న సమయానికి డైరెక్టర్ సినిమాను పూర్తి చేయలేకపోయారు. అన్నిటికి మించి నిర్మాణ సంస్థ ఒక్కసారి కూడా ఈ విషయం పై డైరెక్టర్ ను సంప్రదించకుండానే కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో శంకర్ తప్పు అసలు లేదని’ ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి ఈ తీర్పుతో రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా సినిమాకి ఇక ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆగస్టు మూడో వారం నుండి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.