కేవలం ఒకే జానర్ సినిమాలకు అంటుకుని పోకుండా అన్ని రకాల కథల్ని టచ్ చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు మోహన్ కృష్ణఇంద్రగంటి. ఆయన చేసిన తాజా చిత్రం ‘సమ్మోహనం’ ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. సినీ సెలబ్రిటీలు సైతం చిత్రాన్ని చూసి మోహన్ కృష్ణను అభినందించారు. అంతేగాక ఆయనతో సినిమా చేసేందుకు ఉత్సాహం కూడ చూపించారు.
కానీ ఇంద్రగంటి మాత్రం ఇంకా తన తర్వాతి హీరో ఎవరనేది నిర్ణయించుకోలేదు. స్టార్ హీరోల నుండి ఆఫర్లు ఉన్నాయి, రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి అంటున్న ఆయన ఇది వరకు ప్రేమ కథను చేశాను కాబట్టి ఈసారి దాన్ని రిపీట్ చేయకూడదని అనుకుంటున్నాను, ఏ సినిమా చేసినా భిన్నంగా, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా ఉండాలి అంటున్నారు. మరి చివరికి ఆయన ఎలాంటి కథను చేస్తారో, దానికి ఏ హీరోని ఎంచుకుంటారో చూడాలి.


