నటుడు జగపతిబాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించడంలేదన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పాత్ర నచ్చకపోవడం మూలంగానే ఆయన బయటికి వెళ్లిపోయారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై స్పదించిన దర్శకుడు రావిపూడి జగపతిబాబుగారు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన పాత్రను ప్రేమించారని, కానీ కొన్ని కారణాల వలన ఆయన సినిమాలో చేయడంలేదని, అంతేగానీ ఆయన పాత్ర నచ్చక వెళ్లిపోలేదని, ఈ విషయంలో జగపతి బాబుగారు మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అన్నారు.
రావిపూడి క్లారిటీ ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపిన జగపతిబాబు తన వెర్షన్ తెలిపారు. నేను ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చేశాననే వార్తలు నిజం కాదన్న ఆయన ‘ఆ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చేయమన్నా చేయడానికి రెడీగా ఉన్నాను. నిజానికి ఆ సినిమా కోసం ఇంకో రెండు సినిమాల్ని వదులుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల వలన ఆ సినిమాలో నేను లేను. ఆ సినిమాను మిస్సవుతున్నాను’ అన్నారు. ఆయన మాటల్ని బట్టి ఇష్టంలేకుండానే ఆయన చిత్రం నుండి బయటికి వచ్చేయాల్సి వచ్చిందని అర్థమవుతోంది.