లయన్ డా. సాయి వెంకట్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘జయహో రామానుజ’. బుధవారం హైదరాబాద్లో ఈ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ, సమానత్వ భావనను సమాజానికి చాటిచెప్పిన రామానుజాచార్యుల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. నాణ్యమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే విడుదల కాస్త ఆలస్యమైందని, ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. సినిమాలో తాను రామానుజాచార్యుల పాత్రతో పాటు మరో పది పాత్రల్లో కనిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.
చిత్ర నిర్మాత, నటి ప్రవళ్లిక మాట్లాడుతూ, సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన రామానుజాచార్యుల చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందించినట్లు చెప్పారు. ఇందులో తను శ్రీకృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రలను పోషించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎఫ్పీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు సముద్ర, నిర్మాత రామసత్యనారాయణ తదితరులు చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.


