బాలకృష్ణ ప్రధాన పాత్రగా దర్శకుడు క్రిష్ మహానటుడు ఎన్టీఆర్ జీవితకథను శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ నటించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో విద్యాబాలన్, రానా, మోహన్ బాబు, సచిన్ కేడెకర్ ఇలా భారీ తారాగణం నటిస్తోన్నారు. అలాగే అతిధి పాత్రల్లో కూడా కొందరు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు.
కాగా సినిమాలో అలాంటి అతిధి పాత్ర అయిన ‘మహానటి’ సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ మరో సారి నటించనుంది. నందమూరి తారకరామారావుగారి పక్కన మహానటి సావిత్రిగారు చాలా సినిమాల్లో కలిసి నటించారు. అందులో చాలా చిత్రాలు క్లాసిక్ చిత్రాలుగా మిగిలిపోయాయి, ఐతే వాటిల్లో ముఖ్యంగా అత్యద్భుతమైన కళాఖండాలుగా పేరుగాంచిన చిత్రాలు మాత్రం మాయాబజార్, మిస్సమ్మ చిత్రాలు.
ఐతే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ లో ఈ రెండు చిత్రాల గురించి ప్రస్తావన కూడా ఉందట. కీర్తి సురేష్ సావిత్రిగా కనిపించేది మాయాబజార్ సినిమాలోని శశిరేఖ పాత్రలో, మరియు మిస్సమ్మ సినిమాలోని మేరీ పాత్రలోనేనని తెలుస్తోంది.
ఇక జూలై 5 నుంచి షూటింగ్ కు వెళ్లిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.


