ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ దర్శకుడిగా వెలుగొందిన దర్శకుడు కృష్ణ వంశీ. 2009లో ‘మహాత్మ’ తర్వాత ఆయన చేసిన సినిమాలు ‘పైసా, మొగుడు, గోవిందుడు అందరివాడే, నక్షత్రం’ వంటి సినిమాలు భారీ పరాజయాలుగా నిలవడంతో ఆయన ఛరీష్మా కొంత తగ్గింది. 2017లో చివరి చిత్రాన్ని చేసిన అయన ఈ మధ్యలో వేరే సినిమా ఏదీ చేయలేదు.
కనీసం కొత్త సినిమాను కూడ ప్రకటించలేదు. ఈ గ్యాప్లో ఆయన కొత్త సినిమాకు స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ట్విట్టర్ ద్వారా ఒక అభిమాని కొత్త సినిమా ఏదైనా చేస్తున్నారా అని అడగ్గా దానికి అవునని సమాధానం ఇచ్చారాయన. దీన్నిబట్టి కృష్ణ వంశీ త్వరలోనే తన కొత్త సినిమాను ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఆ సినిమా ఎప్పుడు, ఎవరితో ఉంటుంది అనే విషయాలు తెలియాలంటే ఆయన్నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.