మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదలవుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ, గత కొన్ని రోజులుగా విడుదల తేదీ మారుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో సినిమా వాయిదా పడదని క్లారిటీ ఇచ్చినప్పటికీ, తాజా పరిణామాలు అభిమానుల్లో మళ్ళీ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ను విడుదల చేసింది. అయితే, ఈ పోస్టర్లో ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉండటం, అదే సమయంలో ఓవర్సీస్ బుకింగ్స్ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉండటం వంటివి ఫ్యాన్స్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయినా కూడా మేకర్స్ ఎలాంటి విషయాన్ని రివీల్ చేయకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంటోంది. అసలు ఏప్రిల్ 30న సినిమా వస్తుందా? లేదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఒక భారీ సినిమాకు విడుదల తేదీ విషయంలో స్పష్టత లేకపోవడం దాని క్రేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మేకర్స్ త్వరగా స్పందించి ఒక అధికారిక ప్రకటన చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ విడుదల తేదీ సస్పెన్స్కు మేకర్స్ ఎప్పుడు ఫుల్స్టాప్ పెడతారో వేచి చూడాలి.


