జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కాబోతుంది. అయితే అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీంల చరిత్రను ఆర్ఆర్ఆర్ సినిమాలో వక్రీకరించారని, ఈ సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటీషన్పై నేడు హైకోర్ట్ విచారణ చేపట్టగా అల్లూరి సీతారామరాజును పోలీసుగా చూపి చరిత్రను వక్రీకరించారని పిటీషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అల్లూరి సీతారాజు, కొమ్రంభీంలను దేశభక్తులుగానే చూపామని చెప్పిన దర్శకనిర్మాతలు.. ఆర్ఆర్ఆర్ కేవలం కల్పిత కథేనని కోర్టుకు విన్నవించారు. అంతేకాదు ఈ సినిమాకి కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కూడా జారీ చేసిందని అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం సినిమాతో అల్లూరి, కొమ్రంభీం పేరు, ప్రతిష్టలకు భంగం కలగదని వ్యాఖ్యానిస్తూ ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ నిలిపేయాలన్న పిల్ను కొట్టిపారేసింది.