శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జాను’. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టిన చిత్రబృందం మీడియా సమావేశంలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు కూడా మీడియాతో మాట్లాడుతూ.. జాను చిత్ర విశేషాలు పంచుకున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘తమిళ చిత్రం ‘96’ టీజర్ ను చూడగానే ఆసక్తిగా అనిపించింది. అప్పటి నుండి నేను దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. మా నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి ద్వారా నిర్మాతను సంప్రదించాను. ప్రివ్యూ చూశాను. నేను, హరి సినిమా చూశాం. నాకు తమిళ్ పెద్దగా అర్థం కాదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు నాకు విపరీతంగా ఎక్కేసింది. థియేటర్ బయటకు రాగానే.. అక్కడే నిర్మాతతో మాట్లాడాను. తెలుగులో నేను రీమేక్ చేయాలనుకుంటున్నానని చెప్పాను. అలా సినిమా నాకు బాగా ఎక్కేసింది..’అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.