జూన్ 6వ తేదీన మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జయంతి. కాగా డా. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సంవత్సరంతో 55 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…
డా. రామానాయుడుగారు సురేష్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఈ ఏడాది 55 వసంతాలను పూర్తి చేసుకుంది. మీరెలా ఫీల్ అవుతున్నారు ?
రేపు నాన్నగారి పుట్టినరోజు. ఆయన ఓ రైతు. మొదట చెన్నై ఆయన ఇటుకల వ్యాపారం చేద్దామని వెళ్లారు. కానీ నిర్మాత అయ్యారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ ను మొదలుపెట్టి 55 సంవత్సరాలు అవుతుంది. మొదటి సినిమాకి డబ్బులు పోయినా భయపడకుండా మళ్లీ సినిమాలు చేశారు. అలాగే నిర్మాణంతో పాటు ఇతర వ్యాపారాలైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేశారు. ఏమైన 55 ఏళ్లుగా ఓ సినిమా ప్రొడక్షన్ ను నడపడం గొప్ప విషయం.
ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సినీ నిర్మాణంతో పాటు సినిమాలకు సంబంధించి చాల వాటిల్లో భాగం అయిందిగా ?
సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫిల్మ్ స్కూల్.. ఇలా చాల వాటిల్లో కంటెంట్, టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా సురేష్ ప్రొడక్షన్ ఎదిగింది.
ప్రస్తుత మన సినిమాల గురించి చెప్పండి ?
మన దగ్గర ఉన్న మైథాలజీ కంటెంట్ తో ఇంకా పెద్ద స్థాయిలో సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. మన పాతాళభైరవి, మాయాబజార్ వంటి మైథాలజీ చిత్రాలు మన దగ్గరే మిగిలిపోయాయి. అవే గాని ఏ అమెరికాలో ఉండుంటే.. ఈ పాటికి పాతాళభైరవి, మాయాబజార్ థీమ్ పార్క్ వంటివి ఏర్పాటు అయిఉండేవి.
మరి అలాంటి సినిమాలను ఇపుడైనా ప్రమోట్ చేయొచ్చుగా ?
అలాంటి మన సినిమాలను ఇతర ఏరియాస్ లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అలాగే మనకు లిటరేచర్ పరంగా కావాల్సినంత అద్భుతమైన కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ను స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడానికి టెక్నాలజీని ఇక్కడికి తేవాలని ప్లాన్ చేస్తున్నాం.
మనం ఇప్పటికీ క్లాసిక్ చిత్రాలుగా చెప్పుకుంటున్న చిత్రాలను చాల తక్కువ రోజుల్లోనే చిత్రీకరించారట. కానీ ఇప్పుడు ఒక్కో సినిమా చేయడానికి సంవత్సరాల టైం పడుతుంది. తేడా ఎక్కడ వస్తోంది ?
సినిమా తీసే విధానమే తేడా. సినిమా తియ్యడానికి పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు పాటించిన పద్ధతులను ఇప్పుడు పెద్దగా ఎవరూ పాటించడం లేదు. పాటిస్తోన్న అతికొంతమంది మాత్రం సక్సెస్ అవుతున్నారు. అవెంజర్స్ లాంటి భారీ చిత్రాన్ని కేవలం 100 రోజుల్లో పూర్తి చేశారు. కారణం హాలీవుడ్ లో సినిమా తీసే ప్రాసెస్ చాలా ప్లాన్డ్ గా ఉంటుంది.
పెద్ద నిర్మాతగా మీకు అపారమైన అనుభవం ఉంది. కొత్తగా వచ్చే నిర్మాతలకు మీరిచ్చే సలహాలు ఏమిటి ?
పెద్ద నిర్మాతగా నాకు అపారమైన అనుభవం ఉందంటున్నారు. కానీ నా వరకూ నేను ఆలోచించుకుంటే.. నిర్మాతగా నేను నేర్చుకుంది ఇప్పటివరకూ 65 శాతం మాత్రమే. ఇంకా చాలా నేర్చుకోవాలి. అది ఎడ్యుకేషన్ రూపంలోనే సాధ్యం అవుతుంది. ఎవరైనా నేర్చుకొని సినిమా తీస్తే.. బాగా తియ్యొచ్చు.
మీ బ్యానర్ లో వస్తోన్న భారీ సినిమా ‘హిరణ్య కశిప’ సినిమా గురించి చెప్పండి ?
గత మూడు సంవత్సరాలుగా ‘హిరణ్య కశిప’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. సినిమా బడ్జెట్ ఎంతైన కావొచ్చు.. ఐదు కోట్లు.. వంద కోట్లు అయినా కావొచ్చు. ఆ సినిమాకు పనిచేసే టీంకు ఖచ్చితంగా మంచి ట్రైయినింగ్ ఉండాలి.
మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?
ఇండియన్ మూవీస్ లోనే హిరణ్య భారీ చిత్రంగా తీసుకురాబోతున్నాం. ఇక తరుణ్ భాస్కర్ – వెంకటేష్ మూవీ ఉంది. అదే విధంగా త్రినాధరావు – వెంకేటేష్ కాంబినేషన్ లో కూడా మూవీ ఉంది. ఇంకా తెలుగులో చాలా సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. అలాగే తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా కొన్ని చిత్రాలు చేయబోతున్నాం.