యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్ లో ఒకరైన రాజుగారి పాత్రను చేసిన రాజా రవీంద్ర ఇంటర్వ్యూ విశేషాలు.
మంచి ఎంటర్టైనింగ్ మూవీ, పాండమిక్ సమయంలో ఇలాంటి మూవీ రాలేదు, కాబట్టి ఇది తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని చెప్పుకొచ్చారు. థియేటర్కు వచ్చే ప్రేక్షకుడు రెండు గంటల పాటు ఈ చిత్రాన్ని చూసి నవ్వుకుంటారు అని వ్యాఖ్యానించారు.
తన పాత్ర విషయానికి వస్తే, సాధారణంగా యాబై ఏళ్లు దాటిన వ్యక్తి కి భార్యతో ఎక్కువ అనుబంధం ఉంటుంది, కానీ మనవళ్లు, మనవరాళ్లు వచ్చిన తర్వాత భార్య సరిగ్గా పట్టించుకోకపోతే, ఫేస్బుక్ సహా ఇతర సోషల్ మీడియాల్లో ఎవరో ఒక అమ్మాయితో చాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఓ చిన్న తప్పు కారణంగా హ్యాపీగా ఉండాల్సిన జీవితం ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుందనేదే కథ అని తెలిపారు. అలాగే మిగిలిన ఇద్దరి మనో, భరణి పాత్రలు కూడా ఉంటాయి అని అన్నారు.
ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని యూత్ కూడా కనెక్ట్ అవుతారు, జీవితంలో ఎలాంటి టెన్షన్స్ లేకపోతేనే పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి, అలాంటి ఓ పాయింట్ను ఎంటర్టైన్మెంట్తో చెప్పామని అన్నారు.
ఇందులో తన పాత్ర పేరు రాజుగారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రెడ్డిగారు పాత్ర చేసిన మనోగారు గోల్డ్ షాప్ ఓనర్, రావుగారి పాత్ర చేసిన ధరణి గారేమో ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు అని అన్నారు.
ముగ్గురు స్నేహితులే, కానీ ఒకరికి తెలియకుండా మరొకరు, ఒకే అమ్మాయిని లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు అని అన్నారు.
శ్రీముఖి మంచి యాంకర్, ఎనర్జిటిక్ పర్సన్, మాకు ఇంతకు ముందే పరిచయం ఉంది, మనోగారు, శ్రీముఖి గారైతే చాలా షోస్ కూడా చేసి ఉన్నారు అని తెలిపారు.
తనకు విలన్ పాత్రలు చేయడం ఈజీ అని, తనకు ఫేస్ అడ్వాంటేజ్ తో పాటు డైలాగ్ను సరిగ్గా చెబితే సరిపోతుంది అని, కానీ కామెడీ చేయడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి పాత్రలు చేయాలంటే టైమింగ్ ఉండాలి అని తెలిపారు.
అయితే కోవిడ్ సమయంలో షూటింగ్ చేయడం కాస్త టెన్షన్గానే ఉండిందని, దీన్ని ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నామని, కానీ సినిమా చూసిన తర్వాత థియేటర్స్కు వెళితేనే కరెక్ట్ అనిపించిందని అన్నారు. అదే సమయంలో కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది, దాని వల్ల సినిమా కాస్త ఆలస్యమైంది అంటూ చెప్పుకొచ్చారు.
ఓటీటీ వచ్చాక నటీనటులకు, టెక్నీషియన్స్కు అవకాశాలు పెరిగాయి, దాదాపు 100 నుంచి 120 సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, ఇప్పుడే షూటింగ్స్ బాగా జరుగుతాయి అని అన్నారు.
తనకు సినిమా అంటే చాలా పిచ్చి అని అన్నారు. ఒకవేళ ఆర్టిస్టుగా వేషాలు రాకపోయినా ఇండస్ట్రీలో టీ, కాపీలు ఇచ్చుకునైనా ఉండిపోతానని ఓ సందర్భంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
చిరంజీవిగారి ఆచార్యలో ఇప్పటికే ఓ మంచి రోల్ చేశానని, రోజ్ విల్లా, సోహైల్ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నా అని, ఇలా చాలా సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.