స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ అవుతుండటంతో, దీని కథనంలో ఏవైనా మార్పులు చేస్తున్నారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జక్కన్న తనదైన శైలిలో స్పందించాడు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు బలంగా ఉండే తన చిత్రాలను అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం మార్చడం లేదని రాజమౌళి స్పష్టం చేశాడు. తన బలం ఏంటో తనకు బాగా తెలుసని.. తనకు బాగా తెలిసిన కథలను నమ్మి, వాటిని ప్రేక్షకులకు అంతే నిజాయితీగా ప్రెసెంట్ చేయడమే తన బలమని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఆయనను నడిపించిన ఈ ఫార్ములానే ‘వారణాసి’ కోసం కూడా ఫాలో అవుతున్నట్లు జక్కన్న పేర్కొన్నాడు.
గ్లోబల్ ఆడియన్స్ కోసం తన కథా కథన శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. మన మూలాల్లోని నేటివిటీని, కథలోని ఆథెంటిసిటీని ఎంత స్పష్టంగా చూపిస్తే, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశ ప్రజలకైనా అంతగా కనెక్ట్ అవుతుందని రాజమౌళి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ క్యాస్టింగ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


