ఇండస్ట్రీలో అందరు హీరోలు రెండు మూడు సినిమాలను ఫైనల్ చేసి పెట్టుకున్నారు. దాదాపు హీరోలందరూ ఇంకో రెండేళ్లు ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా అందరూ తర్వాత చేయాల్సిన రెండు సినిమాలను లైన్లో పెట్టుకుని ఉన్నారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కరే స్తబ్దుగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తరవాత ఆయన కేవలం ఒకే ఒక్క సినిమాను ఫైనల్ చేసుకున్నారు. అదే శంకర్ ప్రాజెక్ట్. దీని తరవాత సినిమా ఎవరితో చేస్తారు అంటే క్లారిటీ లేదు.
అలాగని రామ్ చరణ్ కథలు వినకుండా ఉన్నారా అంటే అదీ లేదు. తన వద్దకు వస్తున్న అన్ని కథలని వింటున్నారట. అయితే దేనికీ తొందరపడి గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదట. నచ్చిన కథలన్నింటినీ జాబితాలో చేర్చుకుని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది చరణ్ ఉద్దేశ్యమట. ఎందుకంటే ఇకపై చేసే ప్రతి చిత్రం భారీగా ఉండాలనేది ఆయన టార్గెట్. అందుకే ఎక్కడా పొరపాటు అనేది జరగకుండా ఆచితూచి కథలను, దర్శకులను ఎంచుకుంటున్నారు. సో.. శంకర్ సినిమా తర్వాత చరణ్ ఎవరితో వర్క్ చేస్తారనే విషయంలో ఇప్పుడప్పుడే ఒక స్పష్టత రాకపోవచ్చు.