రిపబ్లిక్ సినిమా పై సాయి తేజ్ ఆడియో మెసేజ్… ఏం చెప్పారంటే?

రిపబ్లిక్ సినిమా పై సాయి తేజ్ ఆడియో మెసేజ్… ఏం చెప్పారంటే?

Published on Nov 24, 2021 9:51 PM IST


సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీలో విడుదల కానుంది, అదీ డైరెక్టర్ కామెంటరీతో. డైరెక్టర్ కామెంటరీతో రిపబ్లిక్ సినిమాను డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేయాలనే సరికొత్త ప్రయత్నానికి జీ 5 శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాయి తేజ్ ఓ ఆడియో మెసేజ్ పంపించారు. అందులో ఆయన మాట్లాడుతూ, “హాయ్, నేను మీ సాయి ధరమ్ తేజ్. నా పై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు థాంక్స్. రిపబ్లిక్ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. జీ 5 ఓటీటీలో నవంబర్ 26న విడుదల అవుతోంది. సినిమా చూడండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్” అని అన్నారు.

జగపతి బాబు మాట్లాడుతూ, “దేవాతో ప్రస్థానం, ఆటో నగర్ సూర్య రెండూ మిస్ అయ్యాను. ఆ రెండూ మిస్ అయినా, రిపబ్లిక్ లో నటించినందుకు గర్వంగా ఉంది. భారతీయులు అందరూ గర్వపడే సినిమా ఇది. తొలిసారి దేవ్ కట్టా డైరెక్టర్స్ కామెంటరీతో సినిమా విడుదల చేస్తున్నాడు. ఇది బోల్డ్ స్టెప్. ఎంతో ధైర్యం ఉంటే తప్ప డైరెక్టర్ కామెంటరీ ఇవ్వలేడు. ఇటువంటి సినిమా తీయడానికి ధైర్యం కూడా కావాలి. ఈ సినిమా ఒప్పుకోవడం సాయి తేజ్ గొప్పతనం. నిజం చెప్పాలంటే, సినిమా చూసినప్పుడు డిజప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే, దేవ్ కట్టా ఎక్స్ట్రాడినరీ సినిమా తీశాడు. రెస్పెక్ట్ విపరీతంగా వచ్చింది. నాకు ప్రేక్షకుల మీద ఇది ఉంది. నేను బాధతో దేవాకు ఫోన్ చేసి ఇటువంటి సినిమాలు చూడటం లేదా? ప్రేక్షకులకు సరిపోవడం లేదా? వాళ్లకు నిజాలు, వాస్తవాలు వద్దు. చెత్తా చెదారం కావాలి. అటువంటి వాళ్ల కోసం నీ టాలెంట్ వేస్ట్ చేస్తున్నావ్ అని చెప్పాను. అది నా జెన్యూన్ ఫీలింగ్. కానీ, నేను అనుకున్న దాని కంటే రెస్పాన్స్ బావుంది. జీ 5 ఓటీటీలో విడుదల అవుతుండటం మంచి విషయం. ఇటువంటి సినిమా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అవుతుందనేది నా నమ్మకం. తేజ్, రమ్యకృష్ణ, ఐశ్వర్య, రవి వర్మ సూపర్ ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు వర్క్ చేశారు” అని అన్నారు.

దర్శకుడు దేవ్ కట్టా మాట్లాడుతూ, “డిజిటల్ వేదికలో కూడా సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్న, మా సినిమాకు బలమైన మద్దతుగా నిలిచిన జీ కు థాంక్స్. జీ లేకపోతే నా విజన్ పరిపూర్ణం అయ్యేది కాదు. ప్రస్థానం తర్వాత నాకు చాలా క‌న్‌ఫ్యూజ‌న్‌ ఉండేది. ఆ సినిమా కంటెంట్‌లో ఉన్న నిజాయతి వల్లే నాకు ఆ ఐడెంటిటీ దొరికింది. రిపబ్లిక్ సినిమాతో దాన్ని వెతుక్కుంటూ పరిగెత్తాను. మన అందరి గొంతులకు ఓ రూపం ఇవ్వాలని రిపబ్లిక్ తీశా. తేజ్, నేను ముందునుంచి ఒకటే ఫిక్స్ అయ్యాం. సినిమాకు, ప్రేక్షకులకు మనం రెస్పెక్ట్ ఇస్తున్నామని! మాకు అదే రెస్పెక్ట్ దొరికింది. మేం చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నాం. చిరంజీవిగారి 153 సినిమాలో రుద్రవీణ నంబర్ వన్ అని చెబుతారు. రిపబ్లిక్ సినిమా ఒక రుద్రవీణ అవ్వాలనేది నా విజన్. చిరకాలం గుర్తుండాలి, రాజకీయాల గురించి ఇంకెవరూ మాట్లాడలేనంత మాట్లాడాలని, కథపై 360 డిగ్రీస్ అనాలసిస్ ఉండాలనే లక్ష్యంతో తీశాం. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. చాలా మంది మళ్లీ రిపబ్లిక్ చూడాలని ఎదురు చూస్తున్నారు. అందువల్లే, డైరెక్టర్ కామెంటరీ అనే ఐడియా వచ్చింది. రెండున్నర గంటలసేపు నా బృందంతో స్క్రీన్ ప్లే సహా ప్రతి సీన్, షాట్ ఎలా ఎందుకు తీశామనేది వివరిస్తూ, అందులో సవాళ్లను డిస్కస్ చేశాం. జీ 5 యాప్‌లో రెండు వెర్షన్స్ ఉంటాయి. ఒకటి రిపబ్లిక్ సినిమా. రెండోది రిపబ్లిక్ విత్ డైరెక్టర్ కామెంటరీ. రెండో ఆప్షన్ ఎంపిక చేసుకున్నప్పుడు, మా వాయిస్ వినిపిస్తుంది. సినిమా విజువల్స్ కనిపిస్తాయి. ఈ సినిమాకు అలా చేయడం అవసరమని ఓ క్రిటిక్ చెప్పారు” అని అన్నారు.

సాయి తేజ్ గురించి దేవ్ కట్టా మాట్లాడుతూ, “నాలుగేళ్ల క్రితం తేజకు రెండు కథలు చెప్పాను. అప్పట్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో ఆ ఇమేజ్ బేస్ చేసుకుని ఆటపాటలు, ఫైట్లు ఉండే మాస్ మసాలా కథలు చెప్పాను. ఒక కథ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంది. ఆల్రెడీ జగపతి బాబు గారితో విన్నర్ చేస్తున్నానని, ఆ సినిమా చేయలేనని చెప్పాడు. తర్వాత ఇంకో కథ చెప్పాను. ఈ రిపబ్లిక్ కథ తన ఇమేజ్ కు సూట్ కాదని అనుకునేవాడిని. క్లైమాక్స్ చెబితే అసలు చేయడని అనుకుంటూనే ఇంకో ఐడియా ఉంది. కానీ, నువ్వు చేయవు అని చెప్పాను. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే భ్రమలో ఉన్నాం. కానీ, ప్రజాస్వామ్యంలో లేం. మనం ఉంటున్నది ప్రజాస్వామ్యమే కాదని చెబుతూ ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో చెప్పే సినిమా ఇది అని చెప్పగానే, ఈ సినిమా నేను చేయాలి అని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఈ క్లైమాక్స్ మారిస్తే నేను సినిమా చేయను అని అన్నాడు. నా సోల్, నాతో అంత బాగా కనెక్ట్ అయ్యాడు. నాకు రెండు ప్లాప్స్ వచ్చి, నేను వెళుతుంటే హీరోలు తప్పించుకుంటున్న రోజుల్లో తను నన్ను వెంటాడాడు. నేను బాహుబలికి డైలాగ్ రాస్తున్నప్పుడు వచ్చి నా ఫ్లాట్ లో కూర్చునేవాడు. ఆ వర్క్ ఎప్పుడు అయిపోతుందోనని, తన జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయి కావాలని సాయి తేజ్ ఎంతో కష్టపడ్డాడు. రిపబ్లిక్ లో ఎక్కువ క్రెడిట్ తనకు చెందుతుంది” అని అన్నారు.

వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు కంటెంట్, జీ స్టూడియోస్ ప్రసాద్ నిమ్మకాయల మాట్లాడుతూ, “దేవ్ కట్టా గారు ప్రస్థానం తర్వాత, ఆ సినిమాలా పది కాలాలు గుర్తుంచుకునేలా ఈ రిపబ్లిక్ ను తీశారు. ఆయనతో సినిమా చేయడం మాకు దక్కిన గౌరవం. సోషల్ మీడియాలో రెస్పాన్స్ చూసిన తర్వాత ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ ఓ లేఖ విడుదల చేద్దామని అనుకున్నాం. ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్‌లో జగపతి బాబు గారు, రమ్యకృష్ణ గారు, సాయి తేజ్ గారు అద్భుతంగా నటించారు. బహుశా హీరో తన సినిమాను థియేటర్లలో చూడకుండా ఓటీటీలో చూడటం, ఈ విధంగా జరుగుతుండటం ఇదే తొలిసారి అనుకుంట. సాయి తేజ్ గారు 25వ తేదీ రాత్రి జీ 5 లో రిపబ్లిక్ సినిమా చూడనున్నారు. ప్రేక్షకులు కూడా చూస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, జీ 5 – లాయిడ్ గ్జేవియ‌ర్‌ మాట్లాడుతూ, “అద్భుతమైన సినిమా రిపబ్లిక్. ఇప్పుడు సినిమాకు ఆల్టర్నేటివ్ మనకు అందిస్తున్నారు. సినిమా ప్రేక్షకులు అందరూ సీన్ బై సీన్ అర్థం చేసుకోవడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి, డైరెక్టర్ కామెంటరీతో విడుదల చేస్తున్నారు. దేవ్ కట్టా గారి విజన్ కు థాంక్స్” అని అన్నారు.

స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ మాట్లాడుతూ, “ఈ సినిమాకు పని చేసే అవకాశాన్ని నాకు కల్పించిన దేవ్ గారికి థాంక్స్. నాలో ఓ రచయిత ఉన్నాడని గుర్తించి, నన్ను ఎంకరేజ్ చేశారు. రిపబ్లిక్ కు పని చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. థియేటర్లలో సినిమా విడుదలైనప్పుడు కొంత మంది కరోనా భయం వల్ల థియేటర్లకు రాలేదు. సినిమాను చూడలేకపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ జీ 5 లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

రవి వర్మ మాట్లాడుతూ, “ఈ సినిమాలో బెంగాలీలో మాట్లాడే మనిషి నేనే. జగపతి బాబు గారితో నా సీన్ ఉంటుంది. సెట్ లో నన్ను చూసి ఎవరో ముంబై నుంచి వచ్చాడని అనుకున్నారట. తర్వాత నన్ను గుర్తుపట్టారు. నేను చిరంజీవి గారి అభిమానిని. అయితే, నా జీవితంలో ఎక్కువ మంది నువ్వు జగపతి బాబు గారిలా ఉంటావు అని చెప్పారు. ఆయన అంటే స్పెషల్ ఇష్టం. ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఆయనతో నటించే అవకాశం ఇచ్చిన దేవ కట్టాకు మరోసారి థాంక్స్” అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు