
ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ‘సైజ్ జీరో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! పీవీపీ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాకు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ సినిమాలో అనుష్క ఇప్పటివరకూ కనిపించని ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. తమిళంలో ఈ సినిమా ‘ఇంజి ఇడుప్పజాగి’ పేరుతో తెరకెక్కుతోంది.
‘సైజ్ జీరో’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ సాయంత్రం సైజ్ జీరోకు సంబంధించిన టైటిల్ లోగోను సినిమా యూనిట్ విడుదల చేసింది. బరువు కొలిచే మెషీన్పై ‘సైజ్ జీరో’ అన్న టైటిల్ వచ్చేలా లోగో డిజైన్ చేశారు. ‘రో’ అనే అక్షరంలో చూపిన స్టైల్ సినిమా కథను ప్రతిబింబించేదిగా కనిపిస్తోంది. ఇక సైజ్ జీరో సినిమాకు సన్నజాజి నడుము అన్నది ఉపశీర్షిక.
‘సైజ్ జీరో’ సినిమాలో కొంత భాగం ఎక్కువ బరువున్న వ్యక్తిగా కనిపిస్తూ తర్వాత ‘సైజ్జీరో’కు మారిపోయే పాత్రలో అనుష్క కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆమె 25 కిలోల బరువు పెరిగి మళ్ళీ సన్నబడ్డారని సమాచారం. పూర్తి రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఈషా గుప్త, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

