టాలీవుడ్లో బయోపిక్ల సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం సంచలన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విశ్వవిఖ్యాత నటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఈ బయోపిక్లో ఎన్టీఆర్ క్యారెక్టర్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేశాడు.. ఆ చిత్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.
ఇక మరోవైపు వివాదాల రారాజు మిస్టర్ జీనియస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సినీ వర్గాల్లో హంగామా మొదలు పెట్టాడు. ఇకపోతే ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆదారంగా యాత్ర అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో బయోపిక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ ఆపధ్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితకథ ఆధారంగా కూడా ఓ చిత్రం తెరకెక్కనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ.. కేసీఆర్ పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటి ప్రతిపాదనలు తన దగ్గరకి రాలేదని నవాజుద్దీన్ ఖండిచాడనుకోండి.. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతం తెలంగాణ దేవుడు అనే చిత్రం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడనే వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ 2019 చిత్రంలో నటిస్తున్న శ్రీకాంత్.. ఆ తర్వాత కేసీఆర్ బయోపిక్లో నటించడానికి ఓకే చెప్పాడని.. అందులో భాగంగానే ఇప్పటి నుండే.. కేసీఆర్ పలు ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు చూస్తున్నాడని తెలుస్తోంది. అంతే కాకుండా నటుడు, రచయిత ఉత్తేజ్ కూడా ఈ చిత్రానికి తన సహకారం అందిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు హరీష్ దర్శకత్వ వహించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.