అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడుల కారణంగా మిడిల్ ఈస్ట్ లో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) మూతపడే ప్రమాదం ఏర్పడింది. అసలు ఈ జలసంధి ఎందుకు అంత ప్రత్యేకం అంటే.. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉండే ఈ సముద్ర మార్గం కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఆయిల్ లో సుమారు 20 శాతం ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇది గనుక మూసుకుపోతే సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా దారుణంగా పడుతుంది.
ఆయిల్ సరఫరా నిలిచిపోతుందనే వార్తలతోనే మార్కెట్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 80 డాలర్లు దాటింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ధర 100 డాలర్లకు పైగా చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల ప్రతి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. మనం రోజూ ఆఫీసుకు వెళ్లే కారు, ప్రయాణించే బస్సు మాత్రమే కాదు, ఇంటి దగ్గరుండి ఇంటర్నెట్ ద్వారా మనం మొబైల్ లో ఆర్డర్ చేసే వస్తువులను తెచ్చే డెలివరీ వాహనాల రవాణా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆహార పదార్థాల నుంచి అన్ని నిత్యావసరాల రేట్లు ఆటోమేటిక్ గా పైకి వెళ్తాయి.
ఇక మన ఇండియా విషయానికి వస్తే, మనం వాడే ఆయిల్లో దాదాపు 88 శాతం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నదే. అందులో సగం కంటే ఎక్కువ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వస్తోంది. అదంతా ఈ హార్ముజ్ జలసంధి గుండానే మన దేశ తీరాలకు చేరుకుంటుంది. ఒకవేళ ఇరాన్ ఈ సముద్ర మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే మనకు ముడి చమురు సరఫరా ఆగిపోయి పెద్ద సంక్షోభం ఎదురవుతుంది. అంతేకాకుండా, ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీ (LNG) గ్యాస్ సరఫరాకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుంది.
అయితే, ఇలాంటి ఆకస్మిక సమస్యలను కొంతవరకైనా తట్టుకోవడానికి మన దేశంలో దాదాపు 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రిజర్వ్ (reserves) గా నిల్వ ఉంది. ఈ నిల్వలతో సుమారు నెలరోజులకు పైగా మన అవసరాలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా నెట్టుకురావచ్చు.
ఒకవేళ ఈ యుద్ధ వాతావరణం ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం, ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా లేదా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. అలాగే, మన దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి, ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే పెట్రోల్, డీజిల్ ను తాత్కాలికంగా ఆపివేసి, ఆ నిల్వలను కేవలం మన దేశ ప్రజల అవసరాల కోసమే వాడుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా, హార్ముజ్ సంక్షోభం త్వరగా సద్దుమణగకపోతే మున్ముందు ఆర్థికంగా గడ్డు పరిస్థితులు తప్పకపోవచ్చు.
