ప్రముఖ నిర్మాత డి. సురేష్బాబు యువ ప్రతిభను ప్రోత్సహించే క్రమంలో ‘పతంగ్’ చిత్ర బృందంతో చేతులు కలిపారు. పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందిన ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన సమర్పణలో డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని చూసిన సురేష్బాబు, టీమ్ను అభినందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. ఇన్స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్తో పాటు వంశీ పూజిత్, ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సురేష్బాబు చేతుల మీదుగా చిత్రంలోని “ఎమోసనల్ డ్రామా” పాట విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కొత్త తరం ఎంతో ఖర్చు పెట్టి, రిచ్గా సినిమా చేశారు. క్లైమాక్స్లో స్టేడియం తీసుకుని పతంగుల పోటీని భారీగా చిత్రీకరించారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చి, విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. నిర్మాత నాని బండ్రెడ్డి, సంగీత దర్శకుడు జోస్ జిమ్మి, నటీనటులు తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. సురేష్బాబు రాకతో తమ సినిమా స్థాయి పెరిగిందని ప్రణవ్ కౌశిక్ తెలిపారు. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న ఈ చిత్రం యువతకు ఫెస్టివల్లా ఉంటుందని నిర్మాతలు వెల్లడించారు.
