డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతిపై హీరో సూర్య ఎమోషనల్ పోస్ట్

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతిపై హీరో సూర్య ఎమోషనల్ పోస్ట్

Published on Jan 27, 2023 9:36 PM IST


నేడు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో విషాద దినం అనే చెప్పాలి. ముందుగా ప్రముఖ సీనియర్ నటి జమున గారి అకాలమరణ వార్త తరువాత ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి హఠాత్తుగా మరణించారు అనే వార్త వినాల్సి వచ్చింది. దాదాపుగా ఎన్నో వందల సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసిన శ్రీనివాస మూర్తి నేడు చెన్నై లోని తన స్వగృహంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస మూర్తి ఎందరో హీరోలకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు తన గొప్ప గాత్రాన్ని అందించి ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల నటులకు డబ్బింగ్ అందించిన శ్రీనివాస మూర్తి కెరీర్ లో ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి మరింతగా దగ్గరయ్యారు.

అజిత్, సూర్య, విక్రమ్ వంటి కోలీవుడ్ స్టార్ నటులకు పక్కాగా తెలుగు డబ్బింగ్ ని ఆయనే అందించేవారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడంతో యావత్ చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకాభిమానులు శ్రీనివాస మూర్తి హఠాన్మరణానికి చింతిస్తూ వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజగా కొద్దిసేపటి క్రితం తమిళ సూపర్ స్టార్ సూర్య తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా శ్రీనివాస మూర్తికి నివాళులు అర్పించారు. ఇది వ్యక్తిగతంగా నాకు పెద్ద నష్టం. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి గారి గాత్రం, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. మీరు మా అందరి నుండి ఇంత త్వరగా దూరమవ్వడం బాధాకరం, మీరు పవిత్రాత్మకు శాంతి కలగాలి అంటూ సూర్య పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు