న్యాచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో, రా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మోహన్ బాబు విలన్గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 21న విడుదల చేసేందుకు చిత్రబృందం పక్కా ప్లానింగ్తో ఉంది. అయితే, ఇటీవల టాలీవుడ్లో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు ఈ మూవీ టీమ్ను ఆలోచనలో పడేశాయి.
ఇటీవల విడుదలైన ‘పెద్ది’ ట్రైలర్కు ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ రావడం.. అలాగే ‘డ్రాగన్’ గ్లింప్స్పై సోషల్ మీడియాలో జరిగిన చర్చలు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ను కాస్త తగ్గించాయి. ‘సలార్’, ‘కేజీఎఫ్’ వంటి బ్యాక్డ్రాప్లను పోలి ఉండటంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ‘ప్యారడైజ్’ బృందం, తమ సినిమా విషయంలో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలని డిసైడ్ అయింది.
ప్రస్తుతానికి ఈ సినిమా నుండి వచ్చిన ‘ఆయా షేర్’ పాట చార్ట్బస్టర్గా నిలిచినప్పటికీ, ఇకపై వేసే ప్రతి అడుగు చాలా కీలకం. అనిరుధ్ రవిచందర్ అందించబోయే మిగతా సాంగ్స్, అలాగే రాబోయే టీజర్, ట్రైలర్ల విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ను కూడా దృష్టిలో పెట్టుకుని, పబ్లిసిటీ మెటీరియల్ని పక్కాగా ప్లాన్ చేయకపోతే సినిమా హైప్కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.


