టాలీవుడ్ ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ దాదాపు తెలుగు స్టార్ హీరోలతో నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు పరిశ్రమలో పేరొందిన ప్రతున్నాయకుల్లో నర్సింగ్ యాదవ్ ఒకరు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటించిన ఆయన కామెడీ, విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. దాదాపు 300 లకుపైగా చిత్రాల్లో నటించారు. నర్సింగ్ యాదవ్ 1968 జనవరి 26న హైదరాబాద్లో జన్మించారు.
ఇంటర్ వరకు చదువుకున్న ఆయన సినిమాల ఆసక్తితో టాలీవుడ్లోకి ప్రవేశించారు. నర్సింగ్ యాదవ్ మొదటి సినిమా ‘హేమాహేమీలు’. ‘క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రి, మాస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాల్లో ఆయన నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు.


