త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కంటే ముందు రచయితగానే పాపులర్. ప్రాసలు, పంచ్ డైలాగులతో తెలుగు సినిమా సంభాషణలకు కొత్త డైవర్షన్ ఇచ్చిన రచయిత ఆయన. ఆయన మాటలు రాసిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. చిన్న చిన్న మాటలతోనే పెద్ద భావాలు పలికించగలరు. అందుకే ఆయన్ను మాటల మాంత్రికుడు అంటుంటారు. ఇండస్ట్రీలో కోటి రూపాయల పారితోషకం తీసుకున్న రచయిత ఎవరైనా ఉన్నారంటే అది త్రివిక్రమే. అలా రచయితగా మొదలైన ఆ ప్రస్థానం ఈరోజు స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకుంది.
దర్శకుడిగా బిజీ అయినప్పటి నుండి త్రివిక్రమ్ బయటి సినిమాలకు పనిచేయడం మానేశారు. సొంత సినిమాలతోనే ఆయన బిజీ అయిపోయారు. అయితే తర్వాతి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి టైమ్ ఉండటంతో మరోసారి బయటి సినిమాకు పనిచేయడానికి రెడీ అయ్యారు ఆయన. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హిరణ్యకశిప’. ఇందులో రానా ప్రధాన పాత్రధారి. ఇప్పటికే మొదలవ్వాల్సి సినిమా లాక్ డౌన్ కారణంగా వెనక్కు వెళ్ళింది. వచ్చే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంభాషణలు రాయమని గుణశేఖర్ కోరడంతో త్రివిక్రమ్ కూడ సరేనన్నారట. త్రివిక్రమ్ కు మైథలాజికల్ సబ్జెక్ట్స్ మీద వాటిలోని పాత్రల మీద మంచి పట్టుంది. బహుశా అందుకే గుణశేఖర్ త్రివిక్రమ్ సహకారం కోరి ఉండవచ్చు. పురాణగాథల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు రూ.180 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.


