ఒక్కప్పటి హీరోగా ఇప్పటి బహుభాషా నటుడిగా శరత్ కుమార్ ఎంతో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అటు హీరోయిన్ గా ఇటు వైవిధ్యమైన పాత్రలను పోషించే నటిగా తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు వరలక్ష్మీ శరత్కుమార్. ప్రస్తుతం ఆమె జేకే అనే ఓ నూతన దర్శకుని దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్కుమార్ బ్లైండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. అయితే ఆ క్యారెక్టర్ లో ఆమె అద్భుతంగా నటిస్తోందని అంటుంది చిత్రబృందం. సినిమాలో వరలక్ష్మీ నటనే హైలెట్ అవుతుందట.. ఈ సినిమా విడుదల తర్వాత నటిగా ఆమె స్థాయి కూడా పెరుగుతుందట.
ఇక మొదటిసారిగా ఓ బ్లైండ్ క్యారెక్టర్లో నటిస్తున్నందుకు చాలా ఛాలెంజ్ గా ఉందని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మాథ్యూ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్కుమార్ విశాల్ హీరోగా లింగు సామి తెరకెక్కించిన ‘పందెంకోడి 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం.