నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అటు మాస్తో పాటు, ఇటు క్లాస్ను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ను చిత్ర బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయశాంతి మాట్లాడుతూ.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీని ఖూనీ చేద్దామనుకునే వారికి మా హెచ్చరిక. తప్పుడు ప్రచారం చేసే వారు తమ పద్ధతి మార్చుకోవాలి. ఇలాంటివి అస్సలు ఉపేక్షించం. కొంతమంది కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి సినిమా ఆడాలనేది మా కోరిక. బాగున్న సినిమాను బాగా లేదని, బాగా లేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం ఏంటి ?, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తారు. సినిమా నచ్చకపోతే చూడకండి. మంచి సినిమాలను చంపే హక్కు మీకు లేదు. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదు’ అని విజయశాంతి మాట్లాడారు.