ఆడియో సమీక్ష : శ్రీ రామ రాజ్యం – అద్భుతం, అపురూపం

ఆడియో సమీక్ష : శ్రీ రామ రాజ్యం – అద్భుతం, అపురూపం

Published on Oct 20, 2011 10:21 AM IST

ప్రముఖ దర్శకులు బాపు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “శ్రీ రామ రాజ్యం”. నందమూరి బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వర రావు, మురళి మోహన్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలను ఇళయరాజా సమకూర్చారు. మొత్తం పద్నాలుగు పాటలు ఉన్న ఈ ఆడియో ఎలా ఉందో చూద్దాం.

ఈ చిత్రం లోని అన్ని పాటలను జొన్నవిత్తుల గారు రచించారు.

1. జగదానంద కారక:

గాయకులు: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, శ్రియ ఘోసాల్

ఈ పాటను ఎస్. పి.బాలసుబ్రమణ్యం ఎంతో అధ్బుతంగా పాడారు. అయన గాత్రం వింటుంటే అచ్చం శ్రీ రాముడ్ని మన కళ్ళతో చుస్తునట్టుగానే ఉంటుంది. రామరాజ్యం ఎంత గొప్పగా ఉంటుందో, ప్రజలు ఎంత సంతోషం గా ఉంటారో వర్ణించే పాట ఇది.

2. ఎవడున్నాడు:

గాయకులు: ఎస్. పి బాలసుబ్రమణ్యం

వాల్మీకి నారద మహర్షిని ఈ లోకంలో అత్యున్నత మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగే పాట ఇది. అక్కినేని ప్రశ్నతో మొదలయ్యి, బాలసుబ్రమణ్యం గాత్రంతో ముగిసే ఈ పాటకు చక్కటి సంగీతాన్ని ఇళయరాజా అందించారు.

3 సీతా రామ చరితం:

గాయకులు: అనిత, కీర్తన

అనిత, కీర్తన మధురంగా ఆలపించిన ఈ పాట లో రామాయణంలోని ప్రధాన అమ్సలైనటువంటి సీతా అపహరణ,అగ్ని పరీక్ష, వానర సైన్యం తో దండు మొదలైన అంశాలు ఉంటాయి.జొన్నవిత్తుల అందించిన చక్కటి సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోస్తుంది

4. శ్రీ రామ లేరా:

గాయకులు: రాము, శ్రేయ ఘోసాల్

శ్రీ రాముని గొప్పతనం,ఆయనకు తన భార్య సీత తో ఉండే అనుభందాన్ని చక్కగా వర్ణించే పాట ఇది. శ్రేయఘోసాల్ చక్కగా ఆలపించిన ఈ పాటకు ఇళయరాజా సంగీతం చక్కగా జతకలిసింది

5. దేవుళ్ళే మెచ్చింది:

గాయకులు: శ్రేయ ఘోసాల్, చిత్ర

ఒక జానపద గీతం లాగా సాగే ఈ పాట, చిత్ర గొంతుతో ఎంతో మధురంగా వినబడుతుంది.ఇళయరాజా ఇచ్చిన సంగీతం ఈ పాటకు ఒక చక్కటి భక్తి భావాన్ని చేకూరుస్తుంది. వినగానే ఆకట్టుకునే ఈ పాటకు జొన్నవిత్తుల సాహిత్యం అద్భుతం.

6. గాలి నింగి నీరు:

గాయకులు: ఎస్.పి. బాలసుబ్రమణ్యం

ఈ పాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొంచెం ఆధునిక సంగీత వాయిద్యాలతో సాగే ఈ పాట బాగున్నప్పటికీ, ఈ చిత్రంలో కాస్త ఇముడుతుందా లేదా అనే ఒక సందేహాన్ని కలిగిస్తుంది. ఈ పాటను హీరో హీరోయిన్ కు దూరం అయనప్పుడు విరహంతో పాడే పాటకు మల్లె ఉంటుంది.

7. రామాయణము శ్రీ రామాయణము:

గాయకులు: శ్రేయ ఘోసాల్, చిత్ర

ఇది మరొక అధ్బుత గానము. చిత్ర మరియు శ్రేయ ఘోసాల్ ఎంతో మనసుతో, మధురంతో ఆలపించిన ఈ గానానికి ఇళయరాజా చక్కటి సంగీతాన్ని అందించారు. ఈ పాటలోని ఆవేదన మీ మనసుని కదిలిస్తుంది.

8.దండకం:

గాయకులు: సురభి శ్రావని, కీర్తన

శ్రీ రాముడ్ని కీర్తిస్తూ సాగే ఒక దండకం ఇది.

9.సీతా సీమంతం:

గాయకులు: శ్రియ ఘోసాల్

సీతాదేవి కి శ్రిమంతం చేసేటప్పుడు పడే పాట ఇది. పాత ఇళయరాజా పాటలు గుర్తుకువస్తాయి ఈ పాటను వింటున్నప్పుడు. శ్రేయా ఘోసాల్ పాడిన ఈ పాట వినటానికి ఎంతో చలాకీగా ఉంటుంది.

10.రామ రామ అనే:

గాయకులు: శ్వేత, అనిత

శ్రీ రాముని చిన్నతనంలో చేసిన అల్లరిని వర్ణిస్తూ ఆలపించే పాట ఇది. పాత చలన చిత్రాలలో మనం వినే పాటల మాదిరిగా ఈ పాట ఉంటుంది. మిగిలిన పాతాళ లాగ అద్భుతంగా లేకపోయినా, ఫర్వాలేదనిపిస్తుంది.

11. కలయా నిజామా:

గాయకులు: టిప్పు

ఈ పాట చిత్రంలో జరుగుతున్న సంఘటనల పట్ల హనుమంతుడి ఆవేదనను తెలుపుతుంది. టిప్పు చక్కగా పాడటంతో ఈ పాటలోని ఆవేదన శ్రోతలకు చక్కగా అర్ధం అవుతుంది.

12.ఇది పట్టాభి:

గాయకులు: శ్వేత

ఇది లవకుశుల మీద చిత్రీకరించే పాటగా మనకు అర్ధం అవుతుంది. జానపద గీతం లాగా సాగే ఈ పాటను శ్వేత పాడారు. చిన్నతనంలో లవకుశుల అలవాట్లు, వారి చేస్తలను ముద్దుగా తెలిపే పాట ఇది. పాత ఇళయరాజా సంగీతం వింటున్నట్టు ఉంటుంది ఈ పాట లో.

13. సప్తస్వరాధమారూడం:

గాయకులు: ఎస్. పి. బాలసుబ్రమణ్యం

రాజుగారి గొప్పతనాన్ని వర్ణించే ఒక చిన్న కీర్తన ఇది. బాలసుబ్రమణ్యం గాత్రం వినసొంపుగా ఉంటుంది

14. మంగళము రామునకు:

గాయకులు: అనిత,కీర్తన

ఇది చక్కటి క్లైమాక్స్ పాట. ఎంతో శుభదాయకంగా , మంగళదాయకంగా ఉంటుంది ఈ గానం. అనిత, కీర్తన ఎంతో ఉత్సాహంతో, సంతోషం తో పాడిన ఈ పాట వినటానికి ఎంతో హాయిగా ఉంటుంది.

విశ్లేషణ:

చాల అరుదుగా మన చలన చిత్ర పరిశ్రమ నుండి కొన్ని ఆణి ముత్యాలు జాలువారుతాయి. అయితే శ్రీ రామ రాజ్యం ఈ కోవకు చెండుతుందా లేదా అని ఇప్పుడే చెప్పలేము కాని ఈ చిత్రం పాటలు మాత్రం అద్భుతం గా ఉన్నాయి. తప్పక కొనుక్కుని దాచుకోవాల్సిన పాటలు.

– మహేష్.కె

సంబంధిత సమాచారం

తాజా వార్తలు