‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘టెంపర్’ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న వక్కంతం వంశీ, ఎప్పట్నుంచో దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుందంటూ ప్రచారం రావడమే తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పటికి అన్నీ కుదిరి వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు రంగం సిద్ధమైపోయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వంశీ డెబ్యూట్ సినిమా తెరకెక్కనుంది.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తైన ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబు నిర్మించనున్నారు. అల్లు అర్జున్ స్టైల్కు సరిపడేలా వంశీ తయారు చేసిన కథ, క్యారెక్టరైజేషన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్గా నిలుస్తాయట. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే అనే సినిమా, లింగుస్వామి దర్శకత్వంలో ఓ తమిళ సినిమా చేస్తోన్న బన్నీ, ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే వచ్చే ఏడాది వక్కంతం వంశీ సినిమా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.