మీడియా వారికి థ్యాంక్స్ : మణిరత్నం

మీడియా వారికి థ్యాంక్స్ : మణిరత్నం

Published on Apr 20, 2015 10:29 PM IST

Maniratnam
చాన్నాళ్ళకు వెండితెరపై మణిరత్నం మ్యాజిక్ మళ్ళీ పనిచేసింది. గత కొంతకాలంగా తనదైన సినిమా తీయలేకపోయిన మణిరత్నం ‘ఓకే బంగారం’ సినిమా ద్వారా మళ్ళీ తానేంటో నిరూపించుకున్నారు. గత శుక్రవారం (ఏప్రిల్ 17న) విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మణిరత్నం తన స్టైల్లో ఒక ప్రేమకథను తెరకెక్కిస్తే అది ఎంత అందంగా, అర్థవంతంగా ఉంటుందో తీసి చూపించారు. సహజీవనం నేపథ్యంలో నడిచే ఈ సినిమాను చాలా తెలివిగా, సున్నితంగా తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.

‘ఓకే బంగారం’ సినిమాకు ముఖ్యంగా ‘ఏ’ సెంటర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల మణిరత్నం తన ఆనందాన్ని వెలిబుచ్చారు. “నా కెరీర్ మొదట్నుంచీ మీడియా నుంచి అందుతూ వస్తోన్న సపోర్ట్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ఓకే బంగారం సినిమా విషయంలో మీడియా ఇచ్చిన రివ్యూలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మీడియా వారికి నా కృతజ్ఞతలు” అంటూ ఓ సందేశాన్ని పంపించారు.

ఇదిలా ఉంటే.. ఓకే కన్మణి/ఓకే బంగారం సినిమా విడుదలకు ముందు ‘క్వాలిఫైడ్ వ్యక్తులు మాత్రమే ఈ సినిమాకు రివ్యూలు రాయాల’ని మాట్లాడి మణిరత్నం భార్య సుహాసిని పెద్ద చర్చకే దారి తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ల జంట ఆద్యాంతం ప్రేక్షకుడిని కట్టిపడేసింది. తారగా నటించిన నిత్యామీనన్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాను ఓ అద్భుతంగా నిలబెట్టింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు