ప్రస్తుతం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పనిచేస్తున్న తీరు అందరినీ కదిలిస్తోంది. ఇన్నేళ్లల్లో ఏ రాజకీయ పార్టీకి పట్టని ఈ సమస్యను పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న అందరిలోను మెదులుతూ ఉంది. ఈరోజు విశాఖలో జరిగిన హార్వర్డ్ డాక్టర్లతో భేటీ సభలో పవన్ ఉద్దానం సమస్యపై పోరాడటానికి గల కారణాన్ని బయటపెట్టారు.
‘తమ్ముడు సినిమా టైంలో ఏదైనా ఒక సామాజిక పరమైన మంచి పని చేద్దామని నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులకు సహాయపడాలని అనుకున్నాను. కానీ అక్కడి రాజకీయ శక్తులు అందుకు అడ్డుపడ్డాయి. అప్పటి నుండి ఆ భాధ నాలో అలానే ఉండిపోయింది. అందుకే ఇప్పుడు ఉద్దానం సమస్యపై పోరాడుతున్నాను. నేను ఒక కులం కోసమో, మతం కోసమో, ప్రాంతం కోసమో, జాతి కోసమో పనిచేయడంలేదు. మానవత్వంతో పనిచేస్తున్నాను. అందుకే దీన్ని రాజకీయం చేయడంలేదు’ అన్నారు.
ఇక ఈ సమస్యపై త్వరిత, శాశ్వత పరిష్కారం కోసం పవన్ రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీకానున్నారు.