
శివ కృతి క్రియేషన్స్ పతాకంపై కేలం కిరణ్ కుమార్ నిర్మించిన సినిమా ‘వీరి వీరి గుమ్మడి పండు’. లవ్, ఫ్యామిలీ, హర్రర్ ఎలిమెంట్స్ ప్రధాన అంశాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్ర, వెన్నెల ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమ్.వీ.సాగర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ఉదయం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైద్రాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై వీరి వీరి గుమ్మడి పండు ట్రైలర్ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ రంగంలో మంచి పేరు గడించి సినిమాలంటే ఆసక్తితో నిర్మాతగా మారిన కిరణ్ భవిష్యత్లో మరిన్ని సినిమాలు చేయాలని కాంక్షించారు. ఇక నిర్మాత కిరణ్ మాట్లాడుతూ.. సినిమాలంటే ఆసక్తితో ఇక్కడికి వచ్చానని, ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ఇక ఇదే కార్యక్రమంలో దర్శకుడు సాగర్, హీరో హీరోయిన్లు రుద్ర, వెన్నెలలు తదితరులు మాట్లాడుతూ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

