మహిధర్, శ్రావ్యారావు హీరో హీరోయిన్లుగా భారతీబాబు పెనుపాత్రుని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నటన’. భవిరి శెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మీ సమర్పణలో గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుభేర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై కుభేర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ను సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. టీజర్ను ఎఫ్.డి.సి.ఛైర్మన్ పి.రామ్మోహన్ రావు విడుదల చేయగా టైటిల్ సాంగ్ మేల్ వెర్షన్ను జె.జెభారవి, ఫిమేల్ వెర్షన్ను చాంద్ మాస్టర్ విడుదల చేశారు. ప్రొడక్షన్ లోగోను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ ఈ బ్యానర్లోనే కుభేరుడు ఉన్నాడు కనుక నిర్మాతకు కనకవర్షం కురుస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పటికి 80 సినిమాలు చేశాను. కానీ మరో సంగీత దర్శకుడి సినిమాలోని పాటకు నేనెప్పుడూ సంగీతం ఇవ్వలేదు. షూటింగ్ పూర్తయ్యాక వచ్చి సినిమాలో ఏదో లోటు కనిపిస్తోంది అంటూ లిరిక్ పేపర్ ఇచ్చి పాట కావాలన్నారు. అప్పటికప్పుడు పది నిముషాల్లో పాట చేసి ఇచ్చాను. ఈ పాట హైలెట్ అని భారవిగారు చెప్పడం ఆనందంగా ఉంది. ఆయన రావడంతో ఈ సభ శోభాయమానంగా మారింది. కొత్తహీరోకు ఆల్ ది బెస్ట్. భారతీబాబు గారు ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించడం లేదు” అన్నారు.
చిత్ర దర్శకుడు భారతీబాబు పెను పాత్రుని మాట్లాడుతూ ‘188 సినిమాలకు రచయితగా పనిచేశాను. పదహారు వందల పాటలు రాశాను. గురుచరణ్గారు నాకు అన్నయ్యలాంటివారు. కుభేర ప్రసాద్ గారితో కలసి ఓ సినిమా చేయబోతున్నాం, కథ, స్క్రీన్ప్లే రాయమన్నారు. రాసాక నువ్వే దర్శకత్వం వహించాలి అన్నారు. అలా నేను ఈ సినిమాకు దర్శకుడినయ్యాను. నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సహాయం లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సినిమాలో అప్పటికే మూడు పాటలు ఉండగా మరో పాట పెట్టాలనిపించింది. జీవితానికి, నటనకు ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో ఈ పాట ఉంటుంది. సంగీత దర్శకుడు ప్రభు ప్రవీణ్ కోసం వెళితే అక్కడే శ్రీలేఖ గారు కనిపించి ఆమెను అడగ్గా అంగీకరించి పదినిముషాల్లో పాట ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జేకే భారవి గారికి పాధాభివందనం. నెలాఖరులో పూర్తి ఆడియోను విడుదల చేస్తాం. రచయితగా మెప్పించిన నన్ను దర్శకుడిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.