గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై తరుణ్ తేజ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నవీన్ నాయని దర్శకత్వంలో డా.లింగేశ్వర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“టైటిల్ బావుంది. తండ్రీ- కూతుళ్ల మధ్య అనుబంధం మీద సినిమా అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. నిర్మాత తొలి సినిమానే అభిరుచితో తీయడం గొప్ప విషయం. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు, కొత్త వాళ్లతో చేసే సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా“ అన్నారు
నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ…“ఇందులో కర్కోటకుడైన కాలేజ్ లెక్చరర్ పాత్రలో నటించాను. దర్శకుడు నాకు చాలా కాలంగా పరిచయం. సినిమాను చాలా బాగా డీల్ చేసాడు. నిర్మాత రాజీ పడకుండా నిర్మించారు“ అన్నారు.
హీరో తరుణ్ తేజ్ మాట్లాడుతూ…“ఇంత మంచి సినిమాలో హీరోగా అవకాశం కల్పించిన మా నిర్మాతకు ధన్యవాదాలు“ అన్నారు.
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ…“ఇందులో నా పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ సినిమాలోనే పర్ఫార్మెన్స్ స్కోపున్న పాత్ర చేయడం లక్కీగా ఫీలవుతున్నా“ అన్నారు.
దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ…“నన్ను నమ్మి డైరక్టర్ గా అవకాశం ఇచ్చిన మా నిర్మాతకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఇదొక రియలిస్టిక్ స్టోరి. పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అందరికీ కనెక్టవుతూ, మనసులు కదిలించే విధంగా ఉంటుంది. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఒక కొత్త దర్శకుడికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇస్తూ సపోర్ట్ చేసారు. సినిమా అవుట్ పుట్ పట్ల టీమ్ అందరం ఎంతో సంతృప్తితో ఉన్నాం. కేదార్ శంకర్, అజయ్ ఘోష్ ల పాత్రలు సినిమాకు హైలెట్ గా ఉంటాయి. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా“ అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీరంగం సతీష్, కొరియోగ్రాఫర్ నరేష్ ఆనంద్, ఎడిటర్ జెపి తదితరులు పాల్గొన్నారు.


