లూసీఫ‌ర్ రీమేక్‌కి మోహ‌న్ రాజా దర్శకుడు – మెగాస్టార్ చిరంజీవి

లూసీఫ‌ర్ రీమేక్‌కి మోహ‌న్ రాజా దర్శకుడు – మెగాస్టార్ చిరంజీవి

Published on Dec 16, 2020 7:02 PM IST

Chiranjeevi

సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్ లో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్దమైన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆచార్య మూవీ చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే చిరంజీవి తన 153 వ సినిమా స్క్రిప్టును ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేశారు. అయితే వచ్చే నెల జనవరి 2021 సంక్రాంతి త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ధం అవుతుంది. అయితే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు ఎన్.వి. ప్ర‌సాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ లూసీఫ‌ర్ సినిమా స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యిందని, ఈ సినిమాకు త‌నిఒరువ‌న్ (ధృవ‌) ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నట్టు తెలిపారు. అయితే మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడని అయితే సంక్రాంతి త‌ర్వాత ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళతామని అన్నారు. అయితే ఏప్రిల్‌లోపు ఈ 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుందని, నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని అని అన్నారు.

ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా కూడా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు న‌టించిన హిట్ల‌ర్ (ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌కుడు‌) చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశానని, ఇప్పుడు ఆయ‌న‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం అదృష్ఠం ద‌క్క‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతమని అన్నారు. తనకు ఈ అవ‌కాశం ద‌క్కినందుకు చాలా ఆనందంగా ఉందని, ఎన్వీ ప్ర‌సాద్ గారు నిర్మాత‌గా రాజీ లేకుండా ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్నట్టు తెలిపారు.

ఈ సినిమా గురించి నిర్మాత ఎన్.వి. ప్ర‌సాద్ మాట్లాడుతూ చిరంజీవి గారి సినిమాని మోహ‌న్ రాజా తెర‌కెక్కించ‌డం చాలా సంతోషంగా ఉందని, చిరంజీవితో పాటుగా మా అందరికీ న‌చ్చేలా మార్పులు చేర్పుల‌తో ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్టును మ‌లిచి మోహ‌న్ రాజా మెప్పించారని చెప్పుకొచ్చారు. మెహస్టార్‌తో సినిమా అంటేనే కొత్త ఉత్సాహం అంద‌రిలో నెల‌కొందని, ఎలాంటి రాజీ లేకుండా భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.

అయితే మోహ‌న్ రాజా ప్ర‌ఖ్యాత ఎడిట‌ర్ మోహ‌న్ వార‌సుడిగా సుప‌రిచితం. ఐదు తెలుగు సినిమాల్ని త‌మిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు చేసిన రికార్డ్ త‌న‌కు ఉంది. ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన హిట్ల‌ర్ సినిమాకి ముత్యాల సుబ్బ‌య్య వ‌ద్ద మోహ‌న్ రాజా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని ఆయన స‌ద్వినియోగం చేసుకుంటార‌నే అభిమానులు భావిస్తున్నారు. త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ‘త‌ని ఒరువ‌న్’ (జ‌యం ర‌వి హీరో) ద‌ర్శ‌కుడిగా అత‌డి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ‘ధృవ’ టైటిల్ తో త‌ని ఒరువ‌న్ రీమేకై తెలుగులోనూ ఘ‌న‌విజ‌యం సాధించిన సంగతి మనందరికి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు